సత్సంబంధాలు నెలకొల్పండి ఏ వ్యక్తీ, ఏ జాతీ ఇతరులను ద్వేషించి మనజాలదు. మన మేధావులు 'మ్లేచ్ఛ' అనే శబ్దాన్ని సృష్టించి ఇతరులతో కలసిమెలసి జీవించటం ఏ రోజున మానివేశారో ఆనాడే భారతదేశ పతనం ప్రారంభమైంది. కనుక మనం ఆ స్థితి నుంచి బయటపడగలగాలి. ఒక వ్యక్తిగాని, జాతిగాని ఇతరులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా, తామే గొప్పవారమని, తమ మతం మరియు తమ ఆచారవ్యవహారాలు మాత్రమే శ్రేష్ఠమైనవని భావించి ఏకాకి జీవనాన్ని ఏర్పరచుకుంటే అది ఆ వ్యక్తికి, జాతికి పతనకారణమవుతుంది. పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధర్మాన్ని అలవరచుకోండి. భారతదేశం తిరిగి తన పూర్వ ఔన్నత్య శిఖరాలను అధిరోహించాలంటే తనకున్న పారమార్ధిక సంపదను ఇతర జాతులకు అందుబాటులో ఉంచగలగాలి. ఆయా జాతుల సంపదను మనకు అవసరమైన మేరకు స్వీకరించటానికి సంసిద్ధంగా ఉండాలి. “వికాసమే జీవితం, సంకుచితత్వమే మరణం. అట్లే ప్రేమతత్వమే జీవికకు చిహ్నం, ద్వేషభావన మరణ సదృశ్యం." కనుక విశాలహృదయులై ఉన్నత శిఖరాలు అధిరోహించండి. మీ జాతికే కాక, యావత్ప్రపంచానికీ ఆదర్శప్రాయులవుతారు. ఎల్లలెరుగని ప్రేమమయ సామ్రాజ్యాన్ని నిర్మిద్దాం. అప్పుడు మాత్రమే భారతదేశం తన సముద్ధరణను కండబలంతో కాకుండా, ఆత్మశక్తిత...