రామోజీ రావు ఈనాడు



రామోజీ రావు ఈనాడు అంటే సామాన్యుడి అక్షరం.. ఈనాడు అంటే కార్మిక కిరణం.. ఈనాడు అంటే విద్యాదీప్తి.. ఇలా ఒకటేంటి 'ఈనాడు'ను ఎన్ని రకాలుగా కీర్తించినా తక్కువే దాని వెనుక ఓ వ్యక్తి కృషి, తపన, పట్టుదల ఉన్నాయి.. ఆయనే రామోజీరావు (Ramoji rao). దినపత్రిక రావాలంటే మధ్యాహ్నం అయ్యే రోజుల్లో సూర్యోదయం కాక ముందే ఇంటి గుమ్మం ముందు దినపత్రిక అందించాలన్న ఆయన ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నదే ఈనాడు (Eenadu). నాటి నుంచి నేటి వరకు 'ఈనాడు' వేసిన ప్రతి అడుగూ సంచలనమే. తెలుగు జర్నలిజంలో తనకంటూ సంపాదకుడిగా ప్రత్యేక పేజీ లిఖించుకున్నారాయన. అందుకే ఆయనను 'మీడియా మొఘల్' అని కీర్తిస్తారు.

ఆరంభమే సంచలనం:

'సూర్యోదయం తరువాత ఈనాడు పేపర్ బాయ్ వీధుల్లో కనిపించకూడదు'.. ఇది రామోజీరావు గీసిన గీత. పత్రిక పంపిణీలో ఎదురయ్యే సవాళ్లకు ఈనాడు తొలి ప్రస్థానమే సమాధానం. మరే పత్రికా లేని ఓ మారుమూల ప్రదేశంలో 1974 ఆగస్టు 10వ తేదీన పడ్డ తొలి అడుగు.. నేటికీ అనంతమై నిరంతరం, తరంతరంగా అలా సాగిపోతూనే ఉంది. దిన పత్రికల పంపిణీ వ్యవస్థకు 'ఈనాడు' వేసిన బాటే అన్ని పత్రికలకు దారిచూపింది. అప్పటి వరకు పత్రిక కావాలంటే విక్రయ కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఈ పద్ధతికి 1977లో చరమగీతం పాడింది ఈనాడే. ఈనాడు రాకముందు పత్రికలకు పల్లెల్లో ఏజెంట్లు ఉండేవారు కాదు. ఈ సరిహద్దు రేఖను ఈనాడు దాటింది. గిరులు, ఝరులు దాటి అడవుల్లో మారు మూల దాగున్న పల్లెల్లో సైతం రెక్కలు కట్టుకుని వాలిపోయింది. అప్పటి వరకు బస్సులు, రైళ్లు, తపాలా ద్వారా మాత్రమే సాగుతున్న పంపిణీ వ్యవస్థను సమూలంగా మార్చేసింది. సొంతంగా ప్రైవేటు రవాణా ఏర్పాటు చేసుకుని మరీ పత్రికను పంపిణీ చేసింది. ఇది పత్రికా ప్రపంచంలోనే పెను సంచలనం. తొలినాళ్లలో ఐదారు వేల కాపీలతో ప్రారంభమై.. ఆ తర్వాత కొన్నేళ్లలోనే తెలుగులోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికగా పేరొందింది.

కార్మికుడితో స్విచ్ ఆన్..:

హంగూ ఆర్భాటం లేకుండా ఒక సాధారణ కార్మికుడే స్విచ్లన్ చేసి 'ఈనాడు'ను ప్రారంభించారు. వ్యవహారిక భాషలో వార్త రచన, ఏ రోజు వార్తలు ఆ రోజే అన్న సూత్రాన్ని మొదటి నుంచి ఈనాడు పాటించటంతో ప్రజా బాహుళ్యంలో విశేషమైన ఆదరణ లభించింది. గ్రామీణ, స్థానిక వార్తలకు చోటు కల్పించడంతో ప్రజల పత్రికగా ప్రజా పత్రికగా ఈనాడు రూపాంతరం చెందింది. రైతులకు సంబంధించిన వార్తలు ప్రచురించడంతో ఈనాడును రైతు పక్షపాతిగా ప్రజలు ఆదరించారు. డెయిలీ సీరియల్స్ను పత్రికలో ప్రచురించడం ప్రవేశ పెట్టిందీ ఈనాడే. అభ్యుదయ రచనలకు ఆటపట్టుగా మారడమే కాదు.. ప్రజల అవసరాలకు విలేకరులే వెళ్లి వార్తా సేకరణ చేసేలా జర్నలిజానికి కొత్త అర్థం చెప్పిందీ ఈనాడు మాత్రమే.

రాజకీయ శక్తిగానూ..:

'ఈనాడు' అంటే కేవలం వార్తలే కాదు తెలుగువారి ఆత్మగౌరవపతాకగా నిలిచింది. 1978-83 మధ్య నాటి కాంగ్రెస్ అధిష్ఠానం ఐదేళ్లలో నలుగురు ఏపీ ముఖ్యమంత్రుల్ని మార్చింది. ఆ సమయంలో తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని పరిరక్షించే కొత్త రాజకీయ శక్తిగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పత్రికగా తెలుగుదేశం పార్టీ రాకను 'ఈనాడు' హర్షించింది. అయితే వ్యక్తులకు ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. నియంతృత్వాన్ని ప్రతిఘటించడమే లక్ష్యంగా తెలుగుదేశానికి అండగా నిలబడ్డామని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి చేస్తే అభినందిస్తుందని, తప్పులు జరిగితే హెచ్చరిస్తుందని రామోజీరావు 1983 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తన సంపాదకీయంలో స్పష్టంచేశారు. దానికి తగ్గట్లే ఎన్టీఆర్ హయాంలో జరిగిన తప్పిదాలను నిస్సంకోచంగా ఎండగట్టింది ఈనాడు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు 'ఈనాడు' అక్షర యుద్ధం చేసింది. 2003లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు విస్తృత కవరేజీ ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాల్నీ బహిర్గతం చేసింది. 2019లో జగన్ పాదయాత్రకూ ఈనాడు కవరేజ్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక జగన్ అరాచకాలను ఎండగట్టి నవ్యాంధ్రలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో తనవంతు పాత్రపోషించింది.

మహిళలకు, పిల్లలకు ప్రత్యేక పేజీలు:

మహిళల కోసం ప్రత్యేక పేజీ ఉండాలన్న ఉద్దేశంతో 1992 సెప్టెంబరు 24న 'వసుంధర'ను ప్రారంభించింది ఈనాడు. అప్పటికి దేశంలో మరే పత్రికా ఇలా మహిళల కోసం ప్రత్యేక పేజీ ఇవ్వడం లేదు. తెలుగు మహిళా లోకమూ దీనికి సాదర స్వాగతం పలికింది. ఆ తరువాతి కాలంలో దాదాపు అన్ని ప్రాంతీయ పత్రికలూ మహిళా అనుబంధాల్ని ప్రారంభించాయి. 2002 జులై 17న ఈనాడు ప్రస్థానంలో మరో మైలురాయి చేరింది. తెలుగు పాఠకులకు వరంగా ఇంద్ర ధనుస్సు వంటి ఏడు ప్రత్యేక పేజీలు ప్రారంభమయ్యాయి. విజ్ఞానం, ఆరోగ్యం, క్రీడలు, సాంకేతిక విజ్ఞానం, బాలల వినోదం వంటి అంశాలతో ఏడు ప్రత్యేక పేజీలుగా ఇవ్వడం ఈనాడు వినూత్న సమాచార విప్లవం. చదువు, సుఖీభవ, ఛాంపియన్, ఈ-నాడు, సిరి, ఈతరం, హాయుజ్జీ పేజీలకు ఈనాడు శ్రీకారం చుట్టింది. ఇతర పత్రికలకు స్పూర్తిగా నిలిచింది.

ప్రజల గొంతుకగా..

'ఈనాడు' అక్షరయాత్రలో మరో సంచలనం పరిశోధనాత్మక పాత్రికేయం. ప్రజల పక్షపాతిగా నిరుపేదలు, బడుగు బలహీనవర్గాల ఆయుధంగా ఈనాడు ప్రచురించిన అనేక వార్తలు ప్రజాధన దుర్వినియోగాన్ని గట్టిగా ఎండగట్టాయి. అధికారుల అలసత్వాన్ని ప్రదర్శించాయి. అభాగ్యులకు ఆర్థిక సాయం అందేలా చేశాయి. అక్షరాలే అస్త్రాలుగా అనేక సామాజిక ఉద్యమాల్నీ ముందుకు నడిపింది ఈనాడు. 1992లో నెల్లూరు జిల్లా దూబగుంటలో సారాపై కన్నెర్ర చేసిన మహిళలకు బాసటగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా సారా ఉద్యమానికి ఊతమిచ్చింది. 1995లో ఈనాడు చేపట్టిన శ్రమదానోద్యమం ఊళ్లకు ఊళ్లను భాగస్వాముల్ని చేసింది. చెరువుల్లో పూడిక తీత, రోడ్ల మరమ్మతులు, కాలువల మరమ్మతులకు గ్రామస్థులు స్వచ్చందంగా కదిలేలా స్ఫూర్తినింపింది. తుపానుల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు బాసటగా నిలవడం ఈనాడులోని మానవత్వానికి నిదర్శనం, తుపాన్ల సమయంలో సంస్థ రిలీఫ్ ఫండ్ ప్రకటించడడం, పాఠకులూ బాధితులకు ఆపన్నహస్తం అందించేలా ప్రోత్సహించడం, ఆ వచ్చిన మొత్తంతో ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా.. తుపాను బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వడంలో ఈనాడు కీలక భూమిక పోషించింది.

సాంకేతికంగానూ..

పత్రికా రచనలోనే కాదు.. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ ముందుంది. తెలుగు దినపత్రికలన్నింటికన్నా ముందే ఇంటర్నెట్లోకి అడుగుపెట్టింది. 1999లో ఈనాడు.నెట్ ద్వారా ఆన్లైన్ పాఠకులకు చేరువైంది. మొబైల్ ఇంటర్నెట్ పెద్దగా వాడుకలో లేని రోజుల్లోనూ ఆన్లైన్లో తాజా వార్తలను ఇవ్వడం ప్రారంభించింది ఈనాడే. ప్రింట్ మీడియాలో ఈనాడు ఓ సంచలనమైతే ఎలక్ట్రానిక్ మీడియాలోనూ రామోజీరావు ప్రారంభించిన ఈటీవీ రూపంలో బుల్లితెర వినోదాన్ని తెలుగువారికి పరిచయం చేశారు. 'ఈటీవీ2' పేరుతో 24 గంటల వార్తా ప్రసారాలకూ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ పేరిట రెండు వేర్వేరు టీవీ ఛానళ్లను అందిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు ఈటీవీ నెట్వర్క్ నన్ను ఎప్పటికప్పుడు రామోజీరావు విస్తరించుకంటూ వెళ్లారు. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ బాలభారత్, ఈటీవీ ఆధ్యాత్మిక ఛానళ్లకు శ్రీకారం చుట్టారు. డిజిటల్ రంగంలో ఈటీవీ భారత్ను ఆరంభించారు.

అవార్డులు

జర్నలిజంలో విలువలను పెంచడంతో పాటు, ఉన్నత ప్రమాణాలను నిలబెట్టే ప్రముఖులకు ఇచ్చే బి.డి. గోయంకా అవార్డును 2001లో రామోజీరావు అందుకున్నారు. జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్, పద్మ విభూషణ్ వరించాయి. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా రామోజీరావు పనిచేశారు.

------------

ప్రజా సమస్యలను చేరవేయడం.. అక్షరాలు, అందమైన ఫొటోలు పేర్చేయడం.. కేవలం ఇందులోనే ఓ పత్రిక విజయం ఉండదు! ఏం రాసినా అది సామాన్యులకు సైతం అర్ధం కావాలి. ఆ అక్షరాలు వారిలో చైతన్యం నింపాలి. కంటపడిన అన్యాయంపై వారు తమ గొంతుక వినిపించాలి. ఇదీ రామోజీరావు (Ramoji rao) చెప్పే మాట. 'ఈనాడు' విజయంలో తెలుగు భాషది కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే 'ఈనాడు'ను ప్రజలకు చేరువ చేసింది. దీనికి కర్త, కర్మ, క్రియ.. రామోజీరావే

భాషా పాండిత్యాన్ని వదిలిపెట్టి చిన్న చిన్న పదాలు రాసేందుకు రచయితలు సంకోచించేవారు. గ్రాంధికంలో రాయడమే గొప్పని భావించే వారు. గిడుగు రామమూర్తి వంటి వారి కృషి ఫలితంగా వ్యావహారిక భాషకు ప్రాధాన్యం లభించింది. రచయితల్లో మార్పు వచ్చింది. సామాన్యులు సైతం చదివితేనే తమ భవిష్యత్ అని విశ్వసించారు. అలా పత్రికా రచనలో వ్యావహారిక భాష మొదలైంది. 'ఈనాడు' దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లింది. తేలిగ్గా చదువుకునేందుకు.. పక్కన ఎవరైనా చదివినా అర్థం చేసుకునే విధంగా భాషా వినియోగం ఉండేది. అందుకు 'ఈనాడు' పెద్ద కృషే చేసింది. 1981లో ఈనాడు భాషా స్వరూపాన్ని' ఆవిష్కరించింది. దాని బాధ్యతను డాక్టర్ బూదరాజు రాధాకృష్ణకు రామోజీరావు అప్పగించారు. తర్వాతి కాలంలో ఈ పుస్తకమే జర్నలిస్టులకు కరదీపికగా మారింది.

శ్రీ, శ్రీమతులకు కత్తెర

దిన పత్రికలో వ్యావహారిక భాష వాడటాన్ని ఓ నియమంగా ఈనాడు పాటించింది. పడికట్టు పదాలు, సుదీర్ఘ శీర్షికలు తగ్గేలా శ్రద్ధ మొదలైంది. శ్రీ శ్రీమతులు వంటి గౌరవ వాచకాలూ తగ్గాయి. ఈనాడు 'భాషా స్వరూపం' రావడంతో ఈ మార్పు సాధ్యమైంది. భాష అంటే ప్రామాణికమైనదని వాదించే వారికి.. ఆ వాదన తప్పని 'ఈనాడు' నిరూపించింది. పేర్లకు ముందు శ్రీ శ్రీమతి.. తర్వాత గారు వంటి గౌరవ సూచికలను తీసేసి బహువచన క్రియను వాడడం మొదలు పెట్టింది. చివర్లో అన్నారు. చెప్పారు.. వంటి పదాల వాడకంతో గౌరవం ఇవ్వడం మొదలు పెట్టింది. తర్వాతి కాలంలో అన్ని పత్రికలూ దీన్ని అనుసరించాయి.

మాండలికానికీ పెద్ద పీట

ఎంత వ్యావహారిక భాషను వినియోగించినా అవి అందరికీ చేరువయయ్యేవి కాదు. ఆ క్రమంలో జిల్లా పత్రికల్లో మాండలికాలకు ఈనాడు పెద్ద పీట వేసింది. జిల్లా, ప్రాంతాన్ని బట్టి పదాల వాడుక, స్థానిక మాండలికాల్లోనే రచన సాగేది. దీంతో అనతికాలంలోనే ప్రజలకు ఈనాడు చేరువైంది. అలాగని ఆంగ్ల పదాలు పూర్తిగా విడిచి పెట్టలేదు. అనువాదం వల్ల కృతకంగా మారిన తెలుగు పదం కన్నా.. సులువుగా అర్థమయ్యే ఇంగ్లిష్ పదాల వాడుకకు జై కొట్టింది. రోడ్డు, బస్సు వంటి పదాలను వాడుకలోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ వ్యవహారాలైనా, స్థానిక విషయాలైనా.. అందరికీ చదువుకునేలా చేయడంలోనే 'ఈనాడు' విజయ రహస్యం దాగుంది.

పేపర్ అంతా ఒక్కరే రాస్తారా?

ఇప్పుడంటే కంప్యూటర్లు వచ్చాయి. పత్రికా ముద్రణ చాలా సులువైంది. ఒకప్పుడు ఈ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండేది. అలాంటి రోజుల్లో 'ఈనాడు' పత్రిక చదివే వారికి ఓ అనుమానం ఉండేది. ఒకటే తరహా రచనా శైలి, పదాల వినియోగం చూసిన వారికి ఒక్కరే రాస్తారా ఏంటి? అన్న అనుమానం ఉండేది. దానికి సమాధానమే ఈనాడు జర్నలిజం స్కూల్. పనిచేస్తున్న జర్నలిస్టులకు 'ఈనాడు' రచనా శైలిని నేర్పించే బదులు.. భావి జర్నలిస్టులకు సొంతంగా శిక్షణ ఇచ్చే ఆలోచన చేశారు రామోజీరావు. అలా పురుడు పోసుకున్నదే ఈనాడు జర్నలిజం స్కూలు. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఒకే తరహా రచనా శైలిని అలవర్చుకోవడం వల్లే పత్రికంతా ఒక్కరే రాశారా అన్నట్టు తోచేది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు వాడుక భాషలో వస్తున్న మార్పులకు 'ఈనాడు' తన విన్యాసాన్ని మార్చుకోవడం వల్లే.. 'ఈనాడు'కు నాడూ నేడూ పాఠకులు పట్టం కడుతున్నారు. దానికి రామోజీరావు ముందు చూపే నిదర్శనం.

తెలుగు వెలుగు..

ఈనాడుతో వ్యావహారిక తెలుగుకు పెద్దపీట వేసిన రామోజీరావు.. తెలుగు భాషాభిమానుల కోసం 'తెలుగు వెలుగు' మాసపత్రికను నడిపారు. చతుర, విపుల కూడా పాఠకులను కొన్ని దశాబ్దాల పాటు అలరించాయి. ఇలా తెలుగు భాషకీ, సమాజానికీ ఇతోధిక సేవ చేసిన రామోజీరావు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇది తెలుగు భాషాభిమానులకు తీరని లోటు!

https://www.bbc.com/telugu/articles/cgxxz0qv8gyo

Comments

Popular posts from this blog

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

UNO & It's Associations Declared Days

రామాయణ దృక్పథం